విద్య

 విద్య :- (ఆంగ్లం : Education),
    అనగా బోధన, మరియు నిర్ధిష్ట నైపుణ్యాల అభ్యసన ల సమీకరణము. ఇంకనూ విశాలమైన భావంలో, పరిజ్ఞానాన్ని, ధనాత్మక తీర్పును, జ్ఞానాన్ని ఇవ్వడం. విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం, సంస్కృతిని వారసత్వాలకు అందిస్తూ సామాజకీయం జేయడం. విద్య అనగా, వెలికి తీయడం. ప్రకృతి ప్రతి మానవునికీ అంతర్-జ్ఞానాన్ని ప్రసాదించి వుంటుంది. దానిని వెలికి తీయడమే విద్య పని. విద్యారంగాలనేకం. మానసిక శాస్త్రం, తత్వ శాస్త్రం, కంప్యూటర్ శాస్త్రం, భాషాశాస్త్రం,సామాజిక శాస్త్రం మొదలగునవి.విధానాలు

విధానాలు:-
                      విద్యావిధానాలు, విద్య మరియు శిక్షణ లను ఇవ్వడానికి స్థాపించబడ్డాయి. ఇవి ప్రధానంగా పిల్లలు మరియు యువకుల కొరకు స్థాపించబడ్డాయి. పిల్లలకు యువకులకు, బోధనాంశాలను నిర్ధారించి, వారి విద్యాఫలితాలను, వారి జీవిత లక్ష్యాల కొరకు ప్రతిపాదింపబడుతాయి. వీటి వలన పిల్లలు, ఏమి నేర్చుకోవాలి?, ఎలా నేర్చుకోవాలి?, ఎందుకు నేర్చుకోవాలి? అనే ప్రశ్నలు సంధించుకొనేలా జాగ్రత్తలు తీసుకొని, వారికి విద్యా బోధన ఇవ్వబడుతుంది. బోధనా వృత్తి, ఇందుకు సర్వదా సహాయపడుతూ, పిల్లలలోని అన్ని రంగాల అభివృద్ధికొరకు సహాయపడుతూ, వారికి మంచి పౌరులుగా తీర్చి దిద్దడానికి ఎల్లవేళలా సిద్ధంగా వుంటుంది. ఈ బోధనా వృత్తి, విద్యా బోధన, బోధనాంశాలు, మూల్యాంకనము మొదలగు అంశాలపై ఆధారపడి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది.
విద్య ప్రాధమిక హక్కు:-
                       విద్యను బాలల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ విద్యా హక్కు చట్టంచేశారు..ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టాల తరహాలో ఇది అమలౌతుంది. 6-14 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో చేరి చదువుకునేలా చూస్తూ, వారికి ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ వయసు పిల్లలు 92 లక్షల మంది పాఠశాల చదువులకు వెలుపలే ఉండిపోతున్నారు. పాఠశాలల్లో చేరని, లేదా మధ్యలోనే చదువు మానేసిన వీరందరినీ తిరిగి చదువుల బాట పట్టించటం విద్యాహక్కు చట్టం ముఖ్యోద్దేశం. స్కూలు నిర్వహణ కమిటీ, లేదా స్థానిక ప్రభుత్వం పాఠశాల చదువులకు దూరంగా ఉండిపోతున్న ఆరేళ్లపైబడిన బాలిబాలికలందరినీ గుర్తించి, వారికి తగిన శిక్షణ ఇప్పించి, పాఠశాలలో తగిన తరగతిలో చేర్పించాల్సి ఉంటుంది. ఏ విద్యార్థికీ పాఠశాలలు అడ్మిషన్‌ను నిరాకరించటానికి వీల్లేదు. ప్రైవేటు పాఠశాలలు సైతం 25% సీట్లను బలహీన, పేద వర్గాలకు కేటాయించాలి.వారి ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.నిధులను 55-45 నిష్పత్తిలో కేంద్రం రాష్ట్రాలు భరించాలి.

ప్రాథమిక విద్య:-
                              ప్రాథమిక" లేదా "ప్రైమరీ" ("Primary") లేదా "ఎలిమెంటరీ" (elementary) విద్య, సాధారణ విద్య తొలి సంవత్సరాలలో ఇవ్వ బడు తుంది. భారతదేశం లోనూ మనఆంధ్రప్రదేశ్ లోనూ ఐదు సంవత్సరములు నిండిన పిల్లలకు ప్రాథమిక పాఠశాల లో చేర్పించడం తప్పని సరి. ఈ పాఠశాలలలో ఒకటి నుండి ఐదు తరగతులకు విద్యాబోధన జరుగుతుంది. ఇందులో మాతృభాష (తెలుగు, ఉర్దూ, తమిళం, ఒరియా, కన్నడ లేదా ఇతరములు), రెండవ భాషగా మాతృ భాష లేదా ఇతర భాష,ఇంగ్లీషు, గణితము, పరిసర విజ్ఞానాలు నేర్పబడుతాయి. మన రాష్ట్రంలో అనేక మాధ్యమాలలో ఈ విద్య అందజేయబడుచున్నది. ఉదాహరణకు, తెలుగు, ఆంగ్లము, ఉర్దూ, కన్నడము, తమిళము, ఒరియా, హిందీ, పంజాబీ, మరాఠీ మొదలగునవి.

సెకండరీ విద్య:-
                 సమకాలీన విద్యావిధానంలో, సెకండరీ విద్య, చాలా ప్రధానమైనది. మనదేశంలో ఈ విద్యావిధానము అతి ప్రధానమైనది. ఈ విద్యకొరకు 6-14 సంవత్సరాల వయస్సు నిర్ధారింపబడినది. ఈ విద్య అందరికీ తప్పనిసరి చేయబడినది. ఈ విద్య ఆధారంగానే అక్షరాస్యత గణాంకాలు జరుగుతున్నవి. ఉన్నత విద్యకు అసలైన పునాది ఇదే. మనదేశంలోని రాష్ట్రాలలో ఈ విద్యను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తుంటారు. పాఠశాలల నిర్వహణ మరియు విద్యా సదుపాయాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, ప్రాంతీయ ప్రభుత్వాలు, ఉదాహరణకు జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్ కార్పొరేషన్, మరియు పురపాలక సంఘం, కలుగజేస్తాయి. జిల్లాలో విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖాధికారిఆధ్వర్యంలో విద్యావిధానమంతా అమలు పరచ బడుతుంది. ఏ మాధ్యమపాఠశాలయైనా, యే యాజమాన్య పాఠశాలయైనా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే వస్తుంది. సెకండరీ విద్యావిధానంలో ప్రధానమైనది పదవ తరగతి. ఈ పదవ తరగతి పరీక్షలు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు నిర్వహించి, వీరే సర్టిఫికేట్ లు జారీ చేస్తారు.

ఉన్నత విద్య:-
             ఉన్నత విద్య, సెకండరీ విద్య, అనగా ఉన్నత పాఠశాల విద్య తరువాత ప్రారంభమౌతుంది. మన దేశంలో విద్యా విధానం 10+2+3 విధానం. 10 అనగా సెకండరీ విద్య, 2 అనగా ఇంటర్మీడియట్ విద్య, 3 అనగా కాలేజి డిగ్రీ విద్య. కాలేజీ డిగ్రీని గ్రాడ్యుయేషన్ అని, దాని తరువాత పోస్ట్ గ్రాడ్యుయేట్ అని వ్యవహరిస్తారు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత రీసర్చ్ పోగ్రాంలు అయిన ఎం.ఫిల్. మరియు పి.హెచ్.డీ. డిగ్రీలు కలవు. ఇవన్నీ ఉన్నత విద్యాశ్రేణిలోకి వస్తాయి.

              ఈ విద్యలన్నీ వివిధ రంగాలలో వుండవచ్చు. ఉదాహరణకు, కళలు, భౌతిక-రసాయనిక శాస్త్రాలు, జీవశాస్త్రం, గణితం, వాణిజ్యం, విద్య, సామాజిక శాస్త్రాలు, మానసిక శాస్త్రం, ఫిలాసఫీ, భాషలు, కంప్యూటర్ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, వైద్య శాస్త్రం, న్యాయశాస్త్రం, ఇంజినీరింగ్ మరియు ఇతర రంగాలు.

వయోజన విద్య:-
                 వయోజనవిద్య అనేక దేశాలలో అవసరంగా మారింది. దీని కొరకు ప్రభుత్వాలు పాటు పడుతున్నాయి. సరైన సదుపాయాలు లేక, బాల్యంలో అభ్యసించలేక, పాఠశాల చదువును నోచుకోలేని వయోజనులకు, వారి తీరిక సమయాలలో అక్షరాభ్యాసం కల్పించడం, దీని ముఖ్యోద్దేశ్యం. ఈ వయోజన విద్య ఒక ప్రహసనంగా మారకుండా చూడడం ప్రతి పౌరుని విధి. సర్వ శిక్షా అభియాన్ అనే ఓ జాతీయ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అందరికీ విద్య కార్యక్రమాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్నాయి. నేషనల్ లిటరసీ మిషన్ లేదా జాతీయ అక్షరాస్యత మిషన్, ఈ కార్యక్రమాలన్నీ అనుసంధానిస్తుంది. 1990 దశకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు జిల్లాలలో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపట్టింది. చిత్తూరు జిల్లాలో అక్షర తపస్మాన్ అనేపేరు పెట్టి అక్షరాస్యతా కార్యక్రమాన్ని అమలు జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు ఇంకో పౌరుడికి విద్యనేర్పాలి.

విద్యా విధానాలు:-

1-ఫార్మల్ ఎడ్యుకేషన్, (Formal Education) లేదా సాధారణ విద్య.
2-ఇన్-ఫార్మల్ ఎడ్యుకేషన్ (Informal Education), లేదా అసాధారణ విద్య.
3-నాన్-ఫార్మల్ ఎడ్యుకేషన్ (Non formal education), లేదా వయోజనవిద్య.

ఫార్మల్ ఎడ్యుకేషన్ Formal Education:-
    పరిణామక్రియ ఆధారంగా, శారీరక వయస్సు మరియు మానసిక వయస్సు ల ఆధారంగా ఇవ్వబడు సాధారణ విద్యను సాధారణ విద్య అంటారు. ఈ విద్య కొరకు విద్యార్థులు విద్యాకేంద్రాలకు వచ్చి అభ్యసిస్తారు. వీరికొరకు నిర్ధిష్టమైన విద్యాకార్యక్రమాలుంటాయి. అభ్యసనాంశాలు కర్రికులమ్, కాలపట్టికలు, బోధన, మూల్యాంకనము, పరీక్షలు, ఫలితాలు వుంటాయి. ఈ విద్య పూర్తికాలపు (Full-time) విద్య.

ఇన్-ఫార్మల్ ఎడ్యుకేషన్ Informal Education:-
    ఈ విద్య జీవిత కాలపు విద్య. శారీరక వయస్సు మరియు మానసిక వయస్సులకు అతీతంగా వుంటుంది. ఈ విద్యకు మంచి ఉదాహరణ దూరవిద్య (Distance Education / Correspondance Education). ఈ విద్యనందించు విద్యాలయాకు మంచి ఉదాహరణ :
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం [1]],
డా. బీ. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం [2],
మౌలానా ఆజాద్ జాతీయ విశ్వవిద్యాలయం,[3].

వయోజన విద్య Non-Formal Education:-
    సాధారణ మరియు అసాధారణ విద్యలకు అతీతంగా, సరైన రీతిలో వయోజనులకు విద్యనందించే విధానమే ఈ వయోజన విద్య. ఇది కూడా జీవనకాల విద్య. దీనికీ వయోజన విద్యా కేంద్రాలు, విద్యాశాఖ ఆధ్వర్యంలో వుంటాయి. వీటి ముఖ్య ఉద్దేశ్యంకూడా అక్షరాస్యత సాధించడమే.

ప్రత్యామ్నాయ విద్య:-
    ప్రత్యామ్నాయ విద్య లేఆ Alternative education, అన్ని విద్యావిధానాలకు అతీతంగా, ప్రత్యేకమైన విద్యావిధానాన్ని కలిగిన విద్యా విధానం. ఈ విధానం ముఖ్య ఉద్దేశ్యం, డ్రాప్-అవుట్స్ ను తగ్గించడం. దీనికొరకు ఓపెన్ స్కూల్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడం జరిగినది. ఈ ఓపెన్ స్కూల్స్ లో చదివిన బాలబాలికలకు నేరుగా సాధారణ్ విద్యావిధాన స్రవంతిలో తీసుకొచ్చి అక్షరాస్యత మరియు విద్యను పెంపొందించడం, అసలైన ఉద్దేశ్యం. ఇది చాలా మంచి ప్రయత్నం. మంచి ఫలితాలను కూడా ఇస్తున్నది.

కర్రికులమ్:-
    `కర్రికులమ్ అనగా "బోధనాంశాలు" మరియు మరియు బోధనకు కావలసిన బోధనా శాస్త్రీయ పద్దతులు. నేటి విద్యావిధానంలో కర్రికులమ్ మరియు కో-కర్రికులమ్ ప్రధానమైనవి.
కర్రికులమ్: భాష మరియు శాస్త్రాల అభ్యసన.
భాష కు ఉదాహరణ: 1. మాతృభాష, 2. ప్రాంతీయ భాష, 3. జాతీయ భాష, ఈ భాషలను నేర్చుకోవడం ముఖ్యం, ఈ సూత్రాన్నే త్రిభాషా సూత్రం అంటారు. ఈ భాషలతోబాటు అదనంగా అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీషు ను నేర్పడం అవసరం. శాస్త్రాలకు ఉదాహరణ: గణితం, పరిసరాల విజ్ఞానం, సామాజిక శాస్త్రాలు, వగైరా.
కో-కర్రికులమ్: శారీరక శ్రమలు, పోటీలు, కళలు మరియు ఇతర మార్గాల ద్వారా వైయక్తిక నిర్మాణం. [1]

విధానము:-
అభ్యసనా పద్దతులు
ఈ అభ్యసనా పద్దతులన్నీ విద్యార్థులకు అవసరం. [2] [3] వీటికి ఉదాహరణ:
కైనెస్థెటిక్స్ : ఈ పద్దతిలో విద్యార్థి తన చేతులకు పనిచెప్పి నేర్చుకుంటాడు.
విజువల్ : ఈ పద్దతిలో విద్యార్థి వీక్షించి, గమనించి, ఏమి జరుగుతున్నది?, ఎలా జరుగుతున్నది?, ఎందుకు జరుగుతున్నది?, ఎప్పుడు జరుగుతున్నది? మున్నగు ప్రశ్నలు వేసుకొని నేర్చుకుంటాడు.
ఆడిటరి : ఈ పద్దతిలో విద్యార్థి విని, విషయసంగ్రహణ చేసుకుని నేర్చుకుంటాడు.

బోధన:-
    ఉపాధ్యాయులకు బోధనా పద్దతులు అత్యవసరం. వీటికి ఉదాహరణ:
కిండర్ గార్టెన్ పద్దతి.
ప్రకృతి పద్దతి.
హ్యూరిస్టిక్ పద్దతి.
బేసిక్ పద్దతి.
ప్రాజెక్ట్ పద్దతి.
ప్రశ్న జవాబుల పద్దతి.
విశదీకరణ పద్దతి
డెమాన్స్ట్రేషన్ పద్దతి

సాంకేతిక విజ్ఞానం:-
    విద్యలో ప్రధానంగా ప్రభావితం చేసే విషయం సాంకేతిక విజ్ఞానం. విద్యాభ్యాసంలో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, అభివృద్ధి చెందిన దేశాలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఆన్-లైన్ విద్య ఓ రకంగా దూరవిద్య. ఈ విధానంలో అభ్యసన మరియు అవగాహనల కొరకు ఓ ప్రత్యేక అనుకూల స్థితి కలుగుతుంది. ఇది చాలా లాభదాయకంగానూ నిరూపింపబడింది. దీని నష్టాలు కూడా నేటి ప్రపంచం గమనిస్తూవుంది. విద్యార్థులలో పాఠశాలల పట్ల అనాసక్తి, ఉపాధ్యాయుల పట్ల అనాదరణ, విద్యావిధానంపట్ల సరియైన పట్టు లేకుండాపోతున్నది. భౌతికంగా అభ్యసన జరుగుతున్నది కాని మానసికంగా విద్యాభ్యాసన జరగడంలేదు. విషయ సంగ్రహణ జరుగుతున్నది గాని, విషయ పరిజ్ఞానం పెంపొందింప బడడంలేదు. విద్యలో ఇదే కీలకం, ఇదియే లోపిస్తున్నది. అరిస్టాటిల్, సోక్రటీసు మరియు ప్లేటో లాంటి మేధావులకు నేటి లోకం జన్మనివ్వలేక పోతున్నది.

చరిత్ర:-
    విద్య యొక్క చరిత్ర, ప్రాచీన కాలంనుండీ మనకు లభిస్తున్నది. ప్రాచీన కాలంలో, పర్ణశాలలు, కుటీరాలు ఋషుల ఆశ్రమాలు, ఆశ్రమ కేంద్రాలు విద్యాభ్యాసం కొరకు కేంద్రాలుగా విలసిల్లేవి. ఈ కేంద్రాలలో సకల శాస్త్రాలూ బోధింపబడేవి. ఉదాహరణకు: ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, రాజనీతి, భాష, యుద్ధవిద్యలు, సంస్కృతి, చదరంగం, కుస్తీ, విలువిద్య, భూగోళం, జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రము మున్నగునవి నేర్పేవారు.

ఫిలాసఫీ:-
    విద్య మరియు తత్వము పరస్పర మూలాలు గలిగినవి. తత్వము "జ్ఞాన ఉద్దేశ్యము, ప్రకృతి విద్య మరియు విద్య యొక్క ఆదర్శము. దీని ఉప ఉద్దేశ్యాలు, మనో తత్వము, మనోజ్ఞాన ప్రకృతి సిద్ధాంతం, మరియు మానవ విషయాలు, సమస్యలూ మరియు విద్యా-సమాజాల మధ్య సంబంధ బాంధవ్యాలు.
తత్వము యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు :-
* జ్ఞాన సమపార్జన.
* జ్ఞాన సమపార్జనకొరకు ప్రకృతి సిద్ధాంతాలు.
* మానవ మరియు సమాజ కళ్యాణం.

మానసిక శాస్త్రం:-
    అమెరికాలోని ఒక తరగతి. ఇందులో తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల పిల్లలు వస్తారు.[4]
విద్యా మానసిక శాస్త్రము, నేటి విద్యావిధానంలో విద్యార్థులు ఎలా జ్ఞానం సంపాదిస్తారు అనేవిషయంపై చర్చిస్తుంది. విద్యాభ్యాసంలో పిల్లల మానసిక ప్రవృత్తులు, సమస్యలు, వైయుక్తిక భేదాలు, పరివర్తన, నడవడికలు మున్నగు వాటి గురించి చర్చిస్తుంది.
దీని ముఖ్య విషయాలు, పిల్లల మానసిక శాస్త్రము మరియు సామాజిక మానసిక శాస్త్రము.

ఆర్థిక శాస్త్రం:-
    ఓ సమాజం ఆర్థికంగా నిలదొక్కుకోగలగాలి, లేదా అభివృధ్ధి చెందాలి అంటే, విద్య అత్యవసరం. సిద్ధాంతాల ప్రకారం, అభివృద్ధిచెందిన దేశాల కంటే, పేద దేశాలు వేగవంతంగా అభివృద్ధి చెందుతాయి. కారణం, అభివృద్ధి చెందిన దేశాలు ప్రయోగాత్మకంగా ఉపయోగించిన విధానాలు. కానీ కొందరు ఆర్థిక వేత్తలు దీన్ని అంగీకరించక ఇలా వాదిస్తారు, "అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతూనే వుంటాయి, వాటికున్న వనరులలాంటివి. పేద దేశాలు పేద దేశాలు గానే వుండి పోతాయి వాటికున్న వనరులలాంటివి", అని.

సామాజిక శాస్త్రం:-
    విద్యా సామాజిక శాస్త్రము ప్రకారం, సామాజిక విద్యా సంస్థలు మరియు విద్యావిధానాలు మరియు వాటి ఫలితాలు పరస్పరం ఆధారపడివుంటాయి. కాని సమాజానికి చెందిన బలహీనతలనుండి సమాజాన్ని రక్షించాలంటే, కేవలం విద్య మాత్రమే మార్గం. విద్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం సమాజ నిర్మాణమే. గురజాడ అప్పారావు చెప్పినట్లు "దేశమంటే మట్టి కాదోయ్; దేశమంటే మనుషులోయ్", దేశం బాగుపడాలంటే పౌరులు లేదా మనుషులు బాగుపడాలి, అప్పుడే సమాజం బాగుపడుతుంది.

అభివృద్ధి చెందుతున్న దేశాలు:-
    అభివృద్ధి చెందుతున్న దేశాలలోని తీవ్ర సమస్యలలో ప్రధానమైనది నిరక్షరాస్యత. ఈ నిరక్షరాస్యతకు మూలం అవిద్య. దీన్ని రూపుమాపుటకు సరైన సాధనం మరియు మార్గం 'విద్య'.

ప్రాపంచీకరణ:-
    మనం ఈ రోజు అవలంబిస్తున్నవన్నీ యూరప్ వాసుల విద్యావిధానాన్నే. విద్య, యూరప్ మరియు అమెరికా వాసులు ప్రవచించిందే విద్య అనే మూఢ విశ్వాసాలనుండి ప్రపంచం బయట పడాలి. ఆసియాకూడా విజ్ఞాన ఖని. అందులోనూ భారత్, చైనా మరియు అరేబియా, విద్యా విజ్ఞానాలకు పుట్టినిల్లు. ప్రపంచానికి మన కాంట్రిబ్యూషన్ ఏపాటిది అని తెలియజేయాలంటే, మన పురాతన, జ్ఞాన సంపన్నుల గూర్చి శోధన అవసరం. నికోలస్ కోపర్నికస్ ప్రపంచానికంతటికీ తెలుసు కాని ఆర్యభట్ట మన దేశంలో మనవారిలో కొందరికే తెలుసు. దీనికి కారణం, మనవారందించిన విజ్ఞానాన్ని మనం ఇంకా శోధించి, పొడిగించి ప్రపంచానికి అందివ్వక పోవడమే.